- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
- విద్యా సందేశాలతో మెరిసిన చిన్నారులు
- హాజరైన ప్రజాప్రతినిధులు..
గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని శ్రీవివేకానంద స్మార్ట్ కిడ్స్ హై స్కూల్ గుమ్మడిదలతో పాటు ఆచార్యాద స్కూల్ అన్నారం విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ చిమ్ముల మల్లారెడ్డి, కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చిమ్ముల లతా రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.
వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు దేవలోకంలోని దేవకన్యల వేషధారణలతో నృత్యాలు ప్రదర్శించారు. బుడిబుడి అడుగులతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను మైమరిపించాయి. జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు, సామాజిక అంశాలపై రూపకాలు, ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణ వంటి అంశాలపై ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనిమల్ డే సందర్భంగా జంతువుల వేషధారణలో ఇచ్చిన సందేశాత్మక ప్రదర్శన ప్రేక్షకులను ఆలోచింపజేసింది.
విద్యార్థుల విద్యా ప్రగతిని ప్రతిబింబించే సైన్స్ మోడల్స్, ఆంగ్ల ప్రసంగాలు, గణిత నైపుణ్య ప్రదర్శనలు నిర్వహించారు. విద్యతో పాటు సాంస్కృతికాభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.

