Sunday, August 2, 2026

కలెక్టర్ ఆదేశాలు డోంట్ కేర్..- అక్రమ నిర్మాణానికి అధికారుల అండ…- కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చినా పెడచెవిన పెట్టిన అధికారులు!- బాధితుడికి అన్యాయం.. అక్రమార్కులకు డీపీఓ సంపూర్ణ సహకారమని ఆరోపణలు!- అధికార పార్టీ నేతల ఒత్తిడితో చర్యలకు వెనుకంజ అనే విమర్శలు!- ప్రైవేట్ స్థలం, ప్రభుత్వ స్థలం కబ్జా చేసినా చోద్యం చూస్తున్న యంత్రాంగమని బాధితుడి ఆవేదన!

జిల్లా అత్యున్నతాధికారి కలెక్టర్ హోదాలో స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయి అధికారుల్లో చలనం కనిపించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లా యెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలుకాలేదని బాధితుడు యామవరం రఘువీర శర్మ ఆరోపిస్తున్నారు.బాధితుడి కథనం ప్రకారం, తనకు చెందిన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే సండ్రు రామచంద్ర రెడ్డి, సండ్రు ప్రతాప్ రెడ్డిలు జీ+2 భవనాన్ని నిర్మించారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన డీఎల్‌పీఓ ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలను ఉల్లంఘించి సీసీ రోడ్డు వైపు వదలాల్సిన సెట్‌బ్యాక్‌లో కాంపౌండ్ వాల్, గేటు నిర్మించడమే కాకుండా తనకు చెందిన 40 గజాలు, ప్రభుత్వానికి చెందిన సుమారు 50 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అలాగే గ్రామంలోని 13 మీటర్లు, 3 మీటర్ల డ్రైనేజీ కాలువలపై కూడా కాంపౌండ్ వాల్ నిర్మించి, ప్రజలకు ఉపయోగపడే నీటి ట్యాప్‌ను సైతం ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.ఈ నివేదిక ఆధారంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ స్పందించి, పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 90, 94, 114 ప్రకారం అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు తెలిపారు. అవసరమైతే పోలీసు బందోబస్తుతో కూల్చివేత చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించడంతో పాటు, మొత్తం వ్యవహారాన్ని యెల్దుర్తి మండల పంచాయతీ అధికారి పర్యవేక్షించి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని గత మే 20న ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.అయితే కలెక్టర్ ఆదేశాలు వెలువడి నెలలు గడిచినా అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. కూల్చివేత చేపట్టాల్సిన పంచాయతీ కార్యదర్శి, పర్యవేక్షించాల్సిన మండల అధికారులు కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడం లేదని, దీనికి జిల్లా పంచాయతీ అధికారుల సహకారం కూడా ఉందని ఆరోపించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు.సామాన్యులు చిన్నపాటి నిర్మాణం చేపట్టినా వెంటనే నోటీసులు జారీ చేసే అధికారులు, ప్రైవేట్ స్థలంతో పాటు ప్రభుత్వ భూములు, డ్రైనేజీలపై నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కలెక్టర్ ఆదేశాలకు విలువ లేదా?: బాధితుడు యామవరం రఘువీర శర్మ”యెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో మా పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌కు ఫిర్యాదు చేశాను. విచారణలో ఆక్రమణలు నిజమేనని తేలడంతో మే 20న నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కొన్ని ఇటుకలు తొలగించి చర్యలు తీసుకున్నట్లు చూపించారు. అధికారులు అక్రమార్కులకు మద్దతుగా నిలవకుండా, జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలి” అని బాధితుడు యామవరం రఘువీర శర్మ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular