కాజిపల్లి అటవీ ప్రాంతంలో కలకలం
సలాం హైదరాబాద్: జిన్నారం మండలం గడ్డపోతారం పురపాలక సంఘం పరిధిలోని కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మళ్లీ భయాందోళన సృష్టించింది. శుక్రవారం కాజీ చెరువు సమీపంలో మేత మేస్తున్న లేగదూడపై దాడి చేసి చంపింది. చిరుత లేగదూడను చంపుతుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరి గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో చాలా రోజులుగా చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. మృతి చెందిన లేగదూడ కాజిపల్లి గ్రామానికి చెందిన గద్దె కృష్ణ అనే రైతుదిగా గుర్తించారు.

