ఐలాపూర్ భూముల విషయంలో న్యాయస్థానాల పరిధిలో రిట్ అప్పీల్ పెండింగ్లో ఉన్నందున, హైడ్రా అధికారులకు ఆ భూముల్లోకి ప్రవేశించే హక్కు లేదని న్యాయవాది ముఖీమ్ తేలిపారు . బుధవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్, హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తమకు అనుకూలమైన డిక్రీ ఉందని, నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా అధికారులు నిత్యం వాహనాలతో తిరుగుతూ వ్యవసాయం చేసుకుంటున్న రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూములపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం అమీన్పూర్ రెవెన్యూ అధికారుల అతిచర్యేనని ఖండించారు. హైడ్రా అధికారి రంగనాథ్తో కలిసి ఒక నూతన సొసైటీ భారీ భూకుంభకోణానికి తెరలేపిందని, త్వరలోనే ఆ గుట్టు రట్టు చేస్తామని హెచ్చరించారు. చట్టబద్ధమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా జోక్యం చేసుకోవడం తగదని, గ్రామస్థులెవరూ భయపడవద్దని, న్యాయస్థానాలు రక్షణ కవచంలా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఐలాపూర్ భూముల విషయంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయమనంతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. హైడ్రా తన పరిధిని మించి వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివాదాస్పదం కాని భూముల జోలికి వెళ్లొద్దని ఎమ్మార్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఐలాపూర్ భూముల్లో హైడ్రాకు ప్రవేశించే హక్కు లేదు: న్యాయవాది ముఖీమ్
RELATED ARTICLES

