అన్నారంలో జరిగిన పరిణామాలపై 13 మంది కౌన్సిలర్ల కూటమి ధీటుగా స్పందన
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం 261లో చోటుచేసుకున్న పరిణామాలపై మెజారిటీ వార్డు కౌన్సిలర్లు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి తమ వైఖరిని వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా అక్రమాలను ప్రశ్నించే హక్కు తమకు రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలు కల్పించాయని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన పరిశ్రమ ప్రహరీ గోడను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తొలగించిన అనంతరం వాస్తవాలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్లగా కొందరు అడ్డుపడి అవాంఛనీయ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, ప్రజా ప్రయోజనాల కోసం రాజీపడకుండా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, రాజశేఖర్, మురళి, చక్రపాణి, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, కిషన్, విజయలక్ష్మి, సోనీ, వరలక్ష్మి, నిర్మల, పద్మ పాల్గొన్నారు.

